ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బహిరంగ సభలో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...జగన్ను అడ్డుపెట్టుకుని ఏపీని అతలాకుతలం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణలో హిట్లర్లా తయారయ్యాడని మండిపడ్డారు. ఏపీ మీద కేసీఆర్ పెత్తనం చేయాలన్న దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండి విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఖబడ్దార్.. మీ ఆటలు సాగవని తెలిపారు.
అదేవిధంగా కేసీఆర్ దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి తనకుందని.. ఇన్ని కేసులు ఉన్న జగన్ మనకు అవసరమా? అని సీఎం ప్రశ్నించారు. ఫామ్-7తో 9 లక్షల ఓట్లు తీసేయమని చెప్పారని..ఓట్లు తీసేయడం జగన్కు కేసీఆర్ నేర్పించారని వివరించారు. ఓట్లు కొనడం, మాట్లాడిన వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్ చేతిలో జగన్ జుట్టు ఉందని.. అందుకే ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారని విమర్శించారు. లోటస్పాండ్లో ఉంటూ ఇద్దరూ కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు పాలకొల్లులో వివరించారు.