వైసీపీ తొలి జాబితా రేపు

SMTV Desk 2019-03-16 10:57:41  ycp,

అమరావతి, మార్చ్ 16:వైసీపీ అధినేత జగన్‌ లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 17 నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచీ పార్టీ ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. 17 ఉదయం హైదరాబాద్ నుంచీ విశాఖపట్నానికి జగన్ వెళ్లనున్నారు. అక్కడ అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. తర్వాత... నర్సీపట్నం, నెల్లిమర్ల, పి.గన్నవరంలో ఎన్నికల ప్రచారం చేస్తారు. జగన్‌తోపాటూ... ఎన్నికల ప్రచారంలో తల్లి వైఎస్‌ విజయలక్ష్మీ, చెల్లి షర్మిల కూడా పాల్గొంటారని తెలిసింది. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ నుంచీ చంద్రబాబు ప్రచారం ప్రారంభించిన రోజే (శనివారం) జగన్ కూడా ప్రచారం ప్రారంభించాల్సి ఉంది. ఐతే... వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకునేలా చేసింది.

జగన్ తన పర్యటన మొదట్లో ప్రతి రోజూ 3 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఆ రకంగా చూస్తే... ప్రచారం చేసేందుకు ఉన్న 24 రోజుల్లో జగన్ 72 నియోజకవర్గాల్ని కవర్ చేసినట్లవుతుంది.

మిగతా 103 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈనెల 25 నుంచి జగన్ రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలనే ఆలోచన ఉంది. హెలికాఫ్టర్‌ ద్వారా ఆయా నియోజక వర్గాలకు వెళ్లి... అక్కడ నుంచీ బస్సుల్లో ప్రచారం చేయనున్నారు జగన్‌.