అమరావతి, మార్చ్ 16:అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (68) అంత్యక్రియలు ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనున్నాయి. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు రాజకీయ నేతలు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్విగ్న వాతావరణం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, సౌమ్యుడిగా పేరు పొందిన మాజీ ఎంపీని ఇంట్లో ఎవరూ లేని టైంలో గొడ్డళ్లలో నరికి అత్యంత దారుణంగా చంపడం ఎక్కడా ఉండదనీ, వివేకా వయసు చూసినా, వ్యక్తిత్వం చూసినా ఎవరూ కూడా చంపాలనే ఆలోచనకు రారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలని, నేడు శాంతి ర్యాలీలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు.