అమరావతి, మార్చ్ 11: ఈ రోజు ప్రముఖ సినీ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో అలీతో పాటు టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన వైసీపీలో చేరడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభలో దేవినేని వైసీపీలోకి అదికారికంగా చేరుతారని సమాచారం. జగన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మైలవరం నియోజకవర్గంలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. తెలుగుదేశం పార్టీలో అవినీతి పెరిగిపోయింది. ఇరిగేషన్ ప్రాజక్టుల్లో దోపిడీ జరుగుతోంది. కేసుల నుంచి తెలుగుదేశం నేతలు తప్పించుకోలేరు’ అని అన్నారు.