అమరావతి, మార్చ్ 2: త్వరలో ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పార్టీల వలసలు కూడా అధికమయ్యాయి. ఇక అధికార పార్టీ టీడీపీ నుండి అనేక మంది నేతలు పక్క పార్టీ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఎక్కువగా టీడీపీ నుండి కీలక నేతలు వైసీపీ లోకి వెళ్లారు. కాగా..దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. దశాబ్ధాల వైరాన్ని పక్కనపెట్టి టీడీపీకి సంఘీభావం తెలుపుతున్నారంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. నిజాయితీ పరులంతా టీడీపీలో చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాలు.. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, గజపతి రాజులే ఇందుకు సాక్ష్యామని చంద్రబాబు పేర్కొన్నారు. కడప జిల్లాల్లో విభిన్న వర్గాలన్నీ ఏకమై టీడీపీతో కలిశాయన్నారు. రాష్ట్రమంతటా ఇదే స్ఫూర్తి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.