అమరావతి, ఫిబ్రవరి 28: విశాఖ పట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ (ఎస్సీఓఆర్) పేరుతో కొత్త జోన్ ఏర్పాటుకు ప్రకటన చేశారు. ఇకపై ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా ఈ కొత్త జోన్లో ఉండబోతోంది. అంటే సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఈ దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి రాబోతోంది. కాగా, విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. వైసీపీ కృషి వల్లే విశాఖపట్నంకు రైల్వే జోన్ వచ్చిందన్నారు. రైల్వే జోన్ కొరకు మా పార్టీ తరపున ఎన్నో పోరాటాలు, పాదయాత్రలు చేశాం. కేంద్రం మీద రైల్వే జోన్ జాప్యంపై మా పార్టీ ఎంపీలు ఎంతో ఒత్తిడి చేశారు. కానీ, ఈ ప్రకటన ఇంకా ముందు వచ్చుంటే ఇంకా బాగుండేది. రైల్వే జోన్ ప్రకటన వల్ల బీజేపీ రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బొత్స సత్యనారాయణ అన్నారు.