అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మంచి ఊపు మీద వుంది. త్వరలో ఎన్నికలు జరగనుండడంతో మిత్ర పక్షాలతో కలిసి ఎలా ముందుకు వెళ్లనున్నామనే విషయాన్ని టిడిపి అధినేత, ఏపి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం, రాజకీయ అంశాలను చర్చించేందుకు మంత్రులతో కలిసి మధ్యాహ్న భోజన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలతో ముందుస్తు పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లడమే మేలని అభిప్రాయడ్డారు. ఇందుకోసం అన్ని పార్టీలతో మాట్లాడుతున్నట్టు చెప్పారు. ముందస్తు పొత్తు పెట్టుకోకపోతే.. ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు కనుక వస్తే ఆ పార్టీనే రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉందన్నారు. ముందస్తు పొత్తు పెట్టుకోవడం వల్ల దీనిని అడ్డుకోవచ్చన్నారు.
విపక్షాల వాదనను సమర్థంగా తిప్పికొట్టకపోతే వారి వాదనే ప్రజల్లోకి వెళ్తుందని, కాబట్టి తప్పకుండా కౌంటర్ ఇవ్వాల్సిందేనన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంటే మంత్రులు ఏమీ పట్టనట్టు ఉండడం సరికాదన్నారు.