రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25: అక్కినేని సమంతకు రాజమహేంద్రవరంలో ఓటు నమోదైంది. ఆమె ఫొటోతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరులో ఓటు నమోదైంది. వివవరాలలోకెళితే.. కొంతమూరు గ్రామంలోని 3-5-12 నంబరు ఇంటి నుంచి చోడవరపు గాంధారీ పేరుతో అధికారులకు ఆన్లైన్లో ఓటు నమోదుకు దరఖాస్తు అందింది. దరఖాస్తుకు హీరోయిన్ సమంత ఫోటోను జత చేశారు. అయితే ఆన్ లైన్ దరఖాస్తును బూత్ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలంచకుండా ఓటు నమోదు చేశారు.
రెండు రోజులపాటు జరిగిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై అధికారులు ఆరా తీయగా గాంధారీ పేరుతో తమ ఇంట్లో ఎవరూలేరని ఆ ఇంటి యజమాని స్పష్టం చేశారు. దీంతో గాంధారీ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. అంతేకాదు ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమూరు వీఆర్వో, బూత్ లెవెల్ అధికారిని రామాయమ్మపై వేటు వేశారు. వారిని సస్పెండ్ చేస్తూ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.