అమరావతి, ఫిబ్రవరి 09: ఆంధ్రప్రదేశ్ లో ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేఏ పాల్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో ఆయన ఈమధ్యే తన పార్టీ ప్రజాశాంతిని స్థాపించారు. రాబోతున్న ఎన్నికలలో ఆయన కూడా పోటి చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేఏ పాల్ విశాఖలో తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మోసగాడైన జగన్కు ఓటేస్తే పాపం చుట్టుకుంటుందని, దేవుడి శాపం తగులుతుందని హెచ్చరించారు. తిరుపతి వేంకటేశునికి పూజలు చేసిన జగన్కు అసలు ఓటు వేయవచ్చా? అని ప్రశ్నించారు. కేఏ పాల్ పై గతంలో జగన్ హిందువుడా? క్రిస్టియనా? మహమ్మదీయుడా? అని ప్రశ్నించినందుకు దాడులు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు రూ.12 వేల కోట్ల ఉచిత హామీలు ప్రకటించడంపై కోర్టుకు వెళ్తామన్నారు పాస్టర్.