అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ తమ పథకాలన్నింటినీ కాపీ కొడుతున్నారని విమర్శించారు. జగన్ నవ రత్నాలను టీడీపీ కాపీ కొట్టడం కాదని.. జగనే తమ పథకాలను కాపీ కొడుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు పెన్షన్ రూ.2వేలు ఇస్తామంటే. జగన్ రూ.3 వేలు ఇస్తామనడం కాపీ కాదా? అని ప్రశ్నించారు.
కాగా ఉద్యోగానికి అర్హత వయసు 45 ఏళ్లు అని... అలాంటిది వృద్ధాప్య పింఛన్ను 45 ఏళ్లకే ఇస్తే ఇక ఉద్యోగాలతో పనేంటని కేఈ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితిని బుధవారం చంద్రబాబుతో చర్చించినట్టు కేఈ తెలిపారు. కోట్ల ఫ్యామిలీ ఏయే సీట్లు అడుగుతోందనే విషయంపై తమ మధ్య చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అయితే కర్నూలు జిల్లాలో మెజారిటీ సీట్లు సాధిస్తామని కేఈ పేర్కొన్నారు.