న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: జరగబోయే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ను టీడీపీ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు టికెట్ తమకే లభిస్తుందని ఆశావహులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇప్పటికే ఈ టికెట్ కోసం కోట్ల కుటుంబం, కేఈ కుటుంబం పోటీపడుతుండగా తాజాగా ఆ జాబితాలో ఎంపీ టీజీ వెంకటేష్ కుటుంబం కూడా చేరిపోయింది. కాగా టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్ కర్నూలు టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్నూలు టికెట్ తన కొడుకుకి లభించడం ఖాయమని టీజీ వెంకటేశ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు భరత్ కర్నూలు నుంచి పోటీచేసి కచ్చితంగా గెలుస్తాడని అన్నారు. తన కుమారుడికే టీడీపీ అధిష్ఠానం టికెట్ ఇవ్వడానికి మొగ్గుచూపుతుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థులకే అధిష్ఠానం టికెట్ కేటాయిస్తుందని చెప్పిన టీజీ, ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబసభ్యుల గురించి ప్రస్తావించారు. సీఎం చంద్రబాబుని కేఈ కుటుంబ సభ్యులు ఇటీవల కలిశారని, వారు కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు వార్తల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. అయితే కర్నూలు టికెట్ కేటాయింపు విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటామని చెప్పారు.