కడప, ఫిబ్రవరి 7: ఈరోజు కడపలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ గడ్డ తనకు, తన కుటుంబానికి చాలా ఇచ్చిందని అన్నారు. తన సొంత గడ్డకు ఋణ పడి ఉన్నానని ఆ ఋణం తప్పకుండ తీర్చుకుంటానన్నారు. దేవుడి దయ వల్ల తాను అధికారంలోకి వస్తే ప్రజల అందరి బాగోగులు చూసుకునే బాధ్యత తీసుకుంటానని, అందర్నీ అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఇక ఈ నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని, వైసీపీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపు నిచ్చారు.
కాగా సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, దొంగ సర్వేలు చేయిస్తూ, వైసీపీ కార్యకర్తల, సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో అధిక మొత్తంలో డబ్బులు కూడా పంచాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు.