న్యూఢిల్లీ, ఫిబ్రవరి 06: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై తీవ్రంగా మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కు బుద్ధా వెంకన్నే ప్రధాన సూత్రధారని జీవీఎల్ ఆరోపించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తప్పుడు పనులను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పది సంవత్సరాల పాటు అధికారానికి దూరమైన చంద్రబాబే బీజేపీతో పొత్తు కోసం చేతులు చాచారని జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబు యూటర్న్ సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. రౌడీ నేతలను టీడీపీ అధినేత ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు హద్దుమీరి మాట్లాడుతున్నారనీ, దీన్ని సహించబోమని హెచ్చరించారు. అయితే బుద్ధా వెంకన్న తనకు బహిరంగంగా క్షమాపణ చెబితే ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేస్తానని అన్నారు.