అమరావతి, ఫిబ్రవరి 3: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. వొంటరిగానే బరిలో దిగనున్న కాంగ్రెస్ జోరు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యేక హోదానే ప్రదానంగా తీసుకొని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో హోదా భరోసా యాత్రను కూడా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారం అందరికి అనుకులంగానే ఉన్నప్పటికి, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాలకు అభ్యర్థులు ఎవరనేదే ఇంకా స్పష్టం కాలేదు. కాంగ్రెస్ నుండి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను ఆశిస్తున్నవారంతా దరఖాస్తులు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ నెల 7 నుండి 10వ తేది వరకు ఆశావహులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 10వ తేది వరకు వచ్చే అప్లికేషన్లన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, వాటిని నేరుగా ఏఐసీసీకి పంపిస్తామన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏపీ ప్రజలను కొంత ఆకర్షిస్తుంది. కానీ ఆ వొక్క హామీ తోనే కాంగ్రెస్ కి విజయం దక్కుతుంద అనేదే ప్రశ్న. ఏపీలో కాంగ్రెస్ వొంటరిగా పోటి చేస్తుంది అనగానే చాలామంది నాయకులు పార్టీ నుంచి బయటకి వెళ్తున్నరు. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో పీసీసీ చెయ్యాల్సింది ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం కాదు, టీడీపీ లేదా వైకాపా నుంచి కనీసం కొందరినైనా కాంగ్రెస్ లోకి రప్పించగలిగితే, ఆశావహుల్లో భరోసా పెరిగే అవకాశాలుంటాయి.