ఆంధ్ర ప్రదేశ్, ఫిబ్రవరి 1: టీడిపి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గురువారం వైసిపి అధినేత జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీలో చేరాలంటే, ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వైఎస్ జగన్ సూచించారని, దాంతో తాను జనవరి 22 న రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో సభాపతికి పంపినట్లు వెల్లడించారు. రాజీనామాను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఆమోదించారు. రాజీనామాను ఆమోదించే ముందు మేడాతో ఫోన్ లో మాట్లాడిన కోడెల, ఆమోదంపై ఆయన అభిప్రాయాన్ని తీసుకున్నారని స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేడా మల్లికార్జున రెడ్డి తోపాటు రాజంపేట నియోజక వర్గం నుంచి తరలివచ్చిన ఆయన అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మేడా మల్లికార్జున రెడ్డితోపాటు ఆయన అనుచరులకు జగన్ వైకాపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కడప జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీకి గౌరవాన్ని తెస్తే నాకు కనీస మర్యాద ఇవ్వకుండా పార్టీ నుంచి సప్పెండ్ చేశారు అని మేడా మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. జగనే కాబోయే సీఎం అని, అందుకే వైకాపాలో చేరినట్లు చెప్పారు