హైదరాబాద్, జనవరి 31: రాష్ట్ర పునర్విభజన హామీల అమలు కోరుతూ రేపు ఏపీ బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ఈ బంద్ కు అందరూ సహకరించాలని కోరారు. రేపు చాలా కీలకమైన సమయమని, ఏపీ ప్రజలు ఐక్యంగా ఉండి తమ నిరసనను భారత ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి రావాలని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలని పిలుపు నిచ్చారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఇది ఎవరింట్లోనో పెళ్లి కాదని, భావితరాల అభ్యున్నతి కోసం చేస్తున్న పోరాటమని, భేషజాలు, పంతాలు, పట్టింపులు అన్నింటిని పక్కనపెట్టి అందరూ కలిసిరావాలని కోరారు.