అమరావతి, జనవరి 21: సోమవారం నాడు అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని, ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు. అంతేకాక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో చేసిన వ్యాఖ్యలపై బాబు స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీకి నేరుగా వచ్చి రాజకీయాలు చేస్తున్నారని బాబు చెప్పారు. ఎన్నికల సమయంలో బంధాలు, బంధుత్వాలు,స్నేహాలను పక్కన పెట్టాలని పార్టీ నేతలకు బాబు సూచించారు.
ఏపీలో ఎన్నికలు జరిగే సమయంలో వారానికో కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ప్రచారాన్ని నిర్వహిస్తామని బీజేపీ నేతలు అంటున్నారని బాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేశారని బాబు గుర్తు చేశారు. డబ్బులన్నీ తామే ఇచ్చామని బీజేపీ చెబుతోందని, బీజేపీ ప్రచారాలను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని బాబు పిలుపునిచ్చారు. మోడీ కుట్ర రాజకీయాలను బయటపెట్టాలని బాబు చెప్పారు. కోల్కతా ర్యాలీకి 23 మంది విపక్ష నేతలు వస్తే బీజేపీతో ఉండే రెండు మూడు పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ వచ్చిన విషయాన్ని బాబు ఈ సమావేశంలో చెప్పారు.