విశాఖ, జూలై 30: ఇటీవల కిడ్నీ సమస్యతో ఉద్దానంలో ప్రజలు మరణిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ చొరవతో హార్వర్డ్ వైద్య బృందం వారు ఉద్దానంలో దర్యాప్తుకు సుముఖత చూపించారు. ఈ నేపధ్యంలో శనివారం హార్వర్డ్ యూనివర్సిటీ నెఫ్రాలజీ విభాగంలో సేవలు అందిస్తున్న డా. జోసెఫ్ బాస్వెంట్రీ, డా. వెంకట్ సబ్బిశెట్టిలు విశాఖకు వచ్చారు. గతంలో ఈ సమస్యపై పరిశోధనలు చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి, కిడ్నీ వ్యాధుల నిపుణుడు డా. టి. రవిరాజ్తో ఈ బృందం ఆంధ్ర వైద్య కళాశాలలో సమావేశమైంది. అనంతరం డాక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ సమస్యపై అధ్యయనం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో పరిశోధనలు చేపడతామని చెప్పారు. దర్యాప్తు విషయాలు చర్చించడానికి పవన్ నేడు విశాఖలో ఈ బృందాన్ని కలవబోతున్నారు. దీనిపై హార్వర్డ్ వైద్య బృందంతో పాటు మరికొంత మంది వైద్యులతో కలిసి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 31న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కలవనున్నారు పవన్ కళ్యాణ్.