విజయవాడ, జనవరి 8: రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, గత నాలుగేళ్ల నుండి టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలపై ‘అవినీతి చక్రవర్తి 6,17,585.19 కోట్లు పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పుస్తకం ఏపీ రాజకీయాల్లో సెగలు కక్కుతోంది. చంద్రబాబునాయుడు పాలనలో అవినీతికి తావు లేదని టీడీపీ చెప్తోంది. మోదీ డైరెక్షన్లోనే సీఎంపై జగన్ పుస్తకాన్ని వేయించారని మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు ఆరోపించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి సీఎం చంద్రబాబుపై వైసీపీ వేసిన బుక్ అరిగిపోయిన టేప్ రికార్డర్ లాంటిదని కొట్టి పారేశారు. జగన్కు తన కుటుంబ ఆస్తులు ప్రకటించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈడీ అటాచ్ చేసిన రూ.43వేల కోట్లను జగన్ రాష్ట్ర ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. రాజధానిలో టీడీపీ నేతలు భూములు కొన్నారన్న ఆరోపణలపై దమ్ముంటే జగన్ చర్చకు రావాలని మంత్రి ప్రత్తిపాటి సవాల్ విసిరారు.