అమరావతి, డిసెంబర్ 26: ఏపీలో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి పర్యటనను వ్యతిరేఖిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై కూడా నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటించడంపై ఆ పార్టీలు ఎందుకు నోరు మెదడపం లేదని నిలదీశారు. ప్రధాని మోదీతో వైసీపీ, జనసేన పార్టీలకు లోపాయికారి వొప్పందం ఉందని ఆరోపించారు. అందువల్లే మోదీ పర్యటనపై జగన్, పవన్ నోరు మెదపడం లేదన్నారు. వైసీపీ, జనసేన నిరసనలు చెయ్యకపోవడం వెనుక కారణం కూడా చీకటి వొప్పందమేనన్నారు.
ప్రత్యేక హోదాపై తాము మెుదటి నుంచి పోరాటం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదేపదే చెప్తోందని మరీ అలాంటి పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ వస్తుంటే ఎందుకు నిరసనకు పిలుపు ఇవ్వడం లేదని విమర్శించారు.
మరోవైపు తాను లేవనెత్తాను కాబట్టే ప్రత్యేక హోదా ఉద్యమం ఇంతటి స్థాయికి వచ్చిందని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అడ్డుపడుతున్న మోదీ ఏపీకి వస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.