కడప, డిసెంబర్ 22: జిల్లాలోని రామాపురం మండలం బండపల్లె వద్ద వొక కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వెంటనే తన కారును ఆపి స్వయంగా ఘటనాస్థలికి వెళ్లారు. తన సిబ్బందితో కలిసి క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108కి ఫోన్ చేశారు. ఎంతసేపు చూసినా అంబులెన్స్ జాడ లేకపోవడంతో వెంటనే తన కారులోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో గాయపడిన వారిని చేర్పించి వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు.