అమరావతి, డిసెంబర్ 17: ఏపీని వణికిస్తున్న పెథాయ్ తుపాను కాకినాడ- యానం మధ్య తీరం దాటింది. మరో రెండు, మూడు గంటలు కాకినాడలో భారీవర్షాలు పడుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సాయంత్రానికి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, అంబాజీపేట, ఖాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి, మూడు అడుగుల మేరకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి