లోకేష్ కు ఖాళీ బిందెలతో ఝలక్..!

SMTV Desk 2018-12-06 13:04:15  Nara Lokesh

నర్సాపురం, డిసెంబర్ 6: పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ కు దెబ్బ ఎదురయింది. నరసాపురం మండలంలోని తూర్పుతాళ్లు, బియ్యప్పు తిప్ప గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు ఖాళీ బిందెలతో మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. స్థానికంగా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి కాన్వాయ్ కు ఖాళీ బిందెలు అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు.

తమ ప్రాంతానికి తాగునీటి వసతి కల్పించాలని అధికారులకు ఇప్పటికే చాలాసార్లు మొర పెట్టుకున్నామని స్థానికులు తెలిపారు.అయినా అధికారులు ఎలాంటి సౌకర్యం కల్పించలేదని వాపోయారు. అపరిశుభ్రమైన నీటిని తాగడం వలన మా కుటుంబ సభ్యులంతా అనారోగ్యం పాలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో మంత్రి లోకేశ్ వారితో మాట్లాడారు, తాగునీటి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు తమ ఆందోళనను విరమించారు.