విజయవాడ, మే 30 : ఆంధ్రప్రదేశ్కు సాయం అందించే విషయంలో కేంద్రం ఏనాడు వెనకడుగు వేయలేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఏపీకు ప్రత్యేక హోదా ఇస్తే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా అడుగుతాయన్నారు. అందుకే ప్రత్యేక హోదా కాకుండా.. దానితో సమానంగా ప్రయోజనాలు ఏపీకి దక్కేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని మోదీకు ఎటువంటి వివక్ష లేదని జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీని విస్మరిస్తారా? అని మీడియా ఆడగగా.. హోదా ఇవ్వకున్న హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని జితేంద్ర సింగ్ సమాధానం చెప్పారు. రాష్ట్రానికి సాయం అందించే విషయంలో కేంద్రం ఏనాడు వెనకడుగు వేయలేదన్నారు. రూ.350 కోట్లు ఏపీ ఖాతాలో వేసి వెనక్కి తీసుకోవడంపై మీడియా ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్ర కారణం కాదని.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని కేంద్రమంత్రి ఆరోపించారు. వినియోగ పత్రాలపై తెదేపా నేతలు మాట్లాడినప్పుడు అమిత్ షా సమాధానం చెబితే తప్పేంటని అని ఆయన అన్నారు.