విజయవాడ, ఏప్రిల్ 23: కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ సోమవారం విజయవాడలో పర్యటించారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు జరిగే నష్టంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన అన్నారు. మే 7వ తేదీన విజయవాడలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగే సమావేశం అజెండా ఖరారు నిమిత్తం వివిధ అంశాలపై స్పందించారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల చాలా రాష్ట్రాలు నష్టపోతాయని థామస్ ఇసాక్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకే సుమారు రూ.80వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అందుకే విజయవాడలో జరిగే సమావేశం ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లాంటి రాష్ట్రాలకి నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై అన్ని రాష్ట్రాలను ఏకం చేసేందుకు సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.