అమరావతి, మార్చి 15 : రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెదేపాపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేన ఆవిర్భావ సభలో భాగంగా నిన్న పవన్.. టీడీపీ ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ.. “కేంద్రాన్ని, మోదీని.. పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి.? ఈ సమావేశం నన్ను, లోకేష్ను, ప్రభుత్వాన్ని తిట్టడానికే పెట్టినట్టుగా.. ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకంలా అనిపిస్తోంది. ప్రత్యేక హోదాపై రాజకీయ శక్తులన్ని కలిసి పోరాడాల్సిన సమయం”. తెదేపా ఎంపీలు పార్లమెంటులోను, బయటా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వంలోని మా మంత్రులతో రాజీనామా చేయించాం. ఇంతగా పోరాడుతుంటే పవన్ మమ్మల్ని విమర్శించడం తగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు నిన్న రాత్రి టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం.