ఆయేషా మీరా భౌతికకాయానికి రీ-పోస్టుమార్టం!

SMTV Desk 2019-12-14 12:10:31  

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. విజయవాడ శివారులో దాదాపు 12 ఏళ్ల క్రితం అత్యాచారం, దారుణ హత్యకు గురైన తెనాలి విద్యార్థిని ఆయేషా మీరా భౌతిక కాయానికి శనివారం రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ఆధారాల కోసం మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు. ఆయేషా మీరాను అప్పట్లో తెనాలి పట్ణణం చెంచుపేటలోని ముస్లిం శ్మశానవాటికలో ఖననం చేశారు. శనివారం అక్కడే రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీంతో సంబంధిత విభాగాల అధికారులు శుక్రవారమే శ్మశానవాటికను సందర్శించి చేయాల్సిన ఏర్పాట్లపై ఓ అవగాహనకు వచ్చారు. కుటుంబ సభ్యులను సైతం వారు కలుసుకున్నట్టు తెలిసింది. కట్టుదిట్ట భద్రత నడుమ రీ-పోస్టుమార్టంను వీడియో చిత్రీకరించనున్నారు.

దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయేషామీరా హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2007 డిసెంబరు 27న విజయవాడ ఇబ్రహీపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఆయేషా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా హత్య కేసు మొదటి నుంచి అనేక మలుపులు తీసుకుంది. నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు విద్యార్థి, సామాజిక సంఘాలు ఆందోళనలు, మరోవైపు రాజకీయ ఒత్తిడిల మధ్య పోలీసులు శాస్త్రీయ పరిశోధన విస్మరించారనే అపవాదు ఉంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షంషాద్‌బేగం, ఇక్భాల్‌ భాషాలకు ఆయేషా మొదటి సంతానం. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నిమ్రా కళాశాలలో బిఫార్మసీ చదువుతూ స్థానికంగా ఉన్న ప్రైవేటు వసతి గృహంలో ఉండేది. 2007 డిసెంబర్ 27న ఉదయం ఆమె రక్తపు మడుగులో మరణించి ఉండటాన్ని గుర్తించారు. డిసెంబర్ 26 రాత్రి ఆమెను హత్య చేశారని పోలీసులు నిర్థరించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత అకస్మాత్తుగా సత్యంబాబు అనే వ్యక్తి తెరమీదకు వచ్చారు. సరిగ్గా 2008 ఆగస్టు 17న సత్యంబాబును ఓ కేసులో అరెస్టు చేశారు. సత్యంబాబే ఆయేషాను హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు. విచారణ అనంతరం దిగువ కోర్టు సత్యంబాబుకు యావజ్జీవ శిక్ష విధించగా, 2017లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సత్యంబాబు పాత్రలేదని, మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమారుడు, హాస్టల్ వార్డెన్, మరికొందరిపై ఆయేషా తల్లిదండ్రులు మొదట్నుంచి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున, తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్‌గా మారింది. దీంతో రీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. దీనికి కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.