అమరావతి, మార్చి 2 : విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎదురుదెబ్బ తగిలిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. విభజన జరిగి నాలుగేళ్లయినా ఇంకా ఆ గాయాలు మానలేదని వాపోయారు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, పలువురు మంత్రులు హాజరయ్యారు. ప్రత్యేక హోదా రాదని, వద్దని బాబు ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చినందునే ప్యాకేజీకి ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఉండదని చెప్పి.. ఇప్పుడు కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నందును ఆంధ్రప్రదేశ్కు అదే పేరుతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెదేపా చిత్తశుద్ధితో పోరాడుతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని చంద్రబాబు అన్నారు.