అమరావతి, ఫిబ్రవరి 25 : తనను విమర్శించే వారంతా తానూ కూడా రాయలసీమ బిడ్డనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన హామీల అమలు విషయంపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్న ఆయన.. ఈ మేరకు నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఎంతగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా, పోరాటాలు చేసినా.. అవన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమేనన్నారు. నేతలందరూ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పని చేయాలంటూ సూచించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందంటూ బీజేపీ ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్ అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో రాయలసీమకు ఎన్నడు జరగని అభివృద్ధి చేశామనే విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం విభజన సమయంలో హామీలను ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల పోరాటం తప్పడం లేదంటూ వ్యాఖ్యానించారు.