అమరావతి, ఫిబ్రవరి 12 : నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడటం గత చరిత్ర అయితే.. రాష్ట్రప్రయోజనాల కోసం పోరాడటం ప్రస్తుత చరిత్ర అని అన్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం మరింత సహకారం అందించి... పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఆదుకోవాలని ఖరాఖండిగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఎంపీలందరికీ అభినందనలు చెప్పారు. మూడున్నరేళ్లుగా కేంద్రానికి అన్నివిధాలా సహకరించామని.. జీఎస్టీ, నోట్లరద్దు వంటి పరిణామాలు తలెత్తినప్పుడు కేంద్రానికి అండగా నిలిచిన విషయాలను సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని వ్యాఖ్యానించారు.