మాలే, ఫిబ్రవరి 6 : హిందూ మహా సముద్రంలో ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ఆ దేశ సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అరెస్ట్ చేయడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ కు లోనయ్యారు. ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్తో పాటు మరో న్యాయమూర్తిని భద్రత దళాలు అరెస్ట్ చేశాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటుకు గురైన విపక్ష ఎంపీల సభ్యత్వాలను పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అధ్యక్షుడు యమీన్ ససేమిరా అనడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. రాజకీయ అనిశ్చితి కారణంగా 15 రోజులపాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ సోమవారం (ఫిబ్రవరి 5న) ప్రకటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో ఇద్దరిని అరెస్ట్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో దేశంలో పరిస్థితిలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.