అమరావతి, జనవరి 13 : తెలుగు లోగిళ్లలో ఏడాదంతా ఆనందం వెల్లివిరియాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సంక్రాంతి అనగా రైతుల పండగ అని, పంట ఇంటికి చేరడంతో ప్రకృతికి కర్షకులు నివేదించే కృతజ్ఞతల పండగ అన్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు సైతం పండగను సంతోషంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో "చంద్రన్న సంక్రాంతి కానుక" ను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందించి అనుబంధ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు పండించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జన్మభూమి - మావూరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టిసీమ ద్వారా మూడేళ్లలో కృష్ణా డెల్టాలో 13లక్షల ఎకరాల్లో రూ.18వేల కోట్ల విలువైన పంట ఇంటికి చేరిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.