పరిశ్రమలను మూయించిన ఘనత చంద్రబాబుదే: జగన్

SMTV Desk 2018-01-10 17:12:22  industreis, close, chandrababu, cm, jagan

చిత్తూరు, జనవరి 10: చిత్తూరు జిల్లాలో సహకార సంఘంలో నిర్వహిస్తున్న పరిశ్రమలను మూయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మహాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రసంగిస్తూ..లాభాలతో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట సహకార చక్కెర కర్మాగారాలను చంద్రబాబు మూయించారన్నారు. అలాగే తన సొంత పాల డెయిరీ హెరిటేజ్‌ సంస్థ అభివృద్ధికి చిత్తూరు విజయ సహకార పాలడెయిరీని మూయించిన ఘనుడు మన ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. పాలడెయిరీ పాలకవర్గ సభ్యులుగా తన నమ్మకస్తులను నియమించి అది మూతపడేలా సీఎం చేశారన్నారు. చిత్తూరు జిల్లా వాసి అయిన చంద్రబాబు స్వలాభానికి పరిశ్రమలు మూయించారన్నారు. అలాంటి వ్యక్తిని ఏమనాలని ప్రశ్నించారు. జిల్లాలో నల్లబెల్లం పండే భూమలు ఉన్నాయని.. అయితే చంద్రబాబు నల్లబెల్లం తయారు చేయకూడదని జీవోలు ఇప్పించారన్నారు. ఈ సందర్భంగా ఆయన చెరకు రైతులను, మహిళలను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.