హైదరాబాద్, జనవరి 9 : బాలికల విద్యను ప్రోత్సహించే దిశగా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని ఉప ముఖ్యమంత్రి కడియ౦ శ్రీహరి అన్నారు. ఇందుకోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రతిపాదించడానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బాలికల విద్యను ప్రోత్సహించేందుకు పీజీ వరకు గురుకుల విధానంలో ఉచిత విద్య అందించనున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశా౦. యుక్తవయస్సు వచ్చిన బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి. వారికి ఆరోగ్య-పరిశుభ్రత కిట్స్ ఉచితంగా అందించాలి" అన్నారు. అంతేకాకుండా బాలికలకు విద్యాలయాల్లో భద్రత కల్పించాలని, ప్రతి పాఠశాలలో పనిచేసే టాయిలెట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.