విజయవాడ, జనవరి 3 : విజయవాడ లో కొలువైన దుర్గ మాతా ఆలయంలో గత డిసెంబర్ 26 ఆర్ధరాత్రి కొందరు తాంత్రిక పూజలు నిర్వహించినట్లు వచ్చిన వార్తలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాయి. కాగా వీటిపై స్పందించిన ఆలయ ఈవో సూర్యకుమారి, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆ వార్తలలో వాస్తవం లేదని మీడియాకు తెలిపారు. గత నెల 26న అర్ధరాత్రి శాంతస్వరూపినిగా ఉన్న దుర్గమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి, భైరవీ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. భైరవీ పూజలు నిర్వహిస్తే శక్తులు వస్తాయనే నేపథ్యంలో భైరవీ పూజలు నిర్వహించి, తర్వాత మళ్లీ దుర్గామాతగా అలంకారాన్ని మార్చారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై స్పందించిన రాష్ట్ర దేవాదాయశాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది.ఈ ఘటన పై సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతే కాకుండా ఈవో సూర్యకుమారిపై ఆరోపణలు రావడంతో ఆమెపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో విజయవాడ కనకదుర్గ ఆలయ ఇన్ఛార్జి ఈవోగా రామచంద్ర మోహన్ను ప్రభుత్వం నియమించినట్లు గా తెలుస్తోంది. దీనిపై సాయంత్రంలోగా అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.