అమరావతి, జూన్ 18: గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములిచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. విమానాశ్రయాన్ని విస్తరించేందుకు భూసమీకరణ ద్వారా ఐదు గ్రామాలకు చెందిన రైతులు 830 ఎకరాల భూములను ఇచ్చారు. ఈ మేరకు వారికి అమరావతిలో ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ముందుగా గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించింది. 19న అజ్యంపూడి, 20న అల్లాపురం, 21న బుద్ధవరం, 22న చిన అవుటుపల్లి, 23న కీసరపల్లి పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. కాగా... ప్లాట్ల కేటాయింపు కార్యక్రమంలో భూములిచ్చిన రైతులంతా పాల్గొనాలని తహసీల్దార్ మాధురి సంబంధిత రైతులను కోరారు.