అమరావతి, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ లో 982 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున (1:2 విధానంలో) 1,925 మందిని ఎంపిక చేస్తూ జాబితాను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థుల ధ్రువ పత్రాలను జనవరి 3 నుంచి 20 వరకు పరిశీలిస్తామని కమిషన్ చైర్మన్ తెలిపారు. అభ్యర్థులు ఎస్సెస్సీ సర్టిఫికెట్, వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వలస వచ్చి ఉంటే మైగ్రేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని ఎపీపీఎస్సీ సూచించింది. అభ్యర్థులు వారికి కేటాయించిన సమయంలో ధ్రువీకరణ పత్రాలను సమర్పించడం విఫలమైతే వారిని పరిగణనలోకి తీసుకోమని, ధ్రువ పత్రాల పరిశీలనకు గడువు పొడగించలేమని కమిషన్ తేల్చిచెప్పింది.