సియోల్, డిసెంబర్ 02 : నేడు ఉత్తరకొరియా దేశం సంబరాల్లో మునిగితేలుతూ, నృత్యాలు చేస్తూ, బాణసంచా పేలుస్తూ ప్రజలు వేడుకలు చేసుకున్నట్లు ప్యాంగ్యాంగ్, అధికారిక మీడియా వెల్లడించింది. ఇంతకి ఈ వేడుకలు ఎందుకో తెలుసా? తాజాగా మరో శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమవడంతో ప్యాంగ్యాంగ్లోని కిమ్ ఈ సంగ్ స్క్వేర్ వద్ద జరిగిన సంబరాల్లో వేల సంఖ్యలో సైనికులు పాల్గొన్నారు. అధికార పార్టీ నిర్ణయాత్మక కమిటీ వైస్ ఛైర్మన్ పాక్ క్వాంగ్ హో నేతృత్వంలో ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా క్వాంగ్ హో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశ అణుశక్తిని చూసి అమెరికా వణికిపోయి ఉంటుందని ఆయన అన్నారు. దీంతో ఎవరూ తమ దేశ హక్కులను అడ్డుకోవడం కుదరబోదని ఆయన చెప్పారు.