కాబూల్, నవంబర్ 18 : అఫ్గానిస్థాన్ రాజధాని లోని కాబూల్ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. నిరంతరం ముష్కరుల నీడలో ఉండే కాబూల్ లో ఒక హాల్లో వివాహ వేడుక జరుగుతుండగా, బంధువులు, ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు గాని, ఒక ఉగ్రవాది ఒంటినిండా బాంబులుతో పెళ్లి వేదికవైపు దూసుకొస్తున్నాడు. ఇది గమనించిన ఓ పోలీస్ ఆధికారి అత్యంత ధైర్య, సాహసాలతో తన ప్రాణాలును సైతం లెక్కచేయకుండా తన రెండు చేతులతో అతడిని బంధించాడు. అంతే తను కూడా ఆ ఘటనలో ఆమరుడయ్యాడు. ఈ ఘటన లో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది క్షతగాత్రులయ్యారు. ఇంతటి సాహసం చేసిన ఆ యువకుని పేరు బసమ్ పాచా. 25 ఏళ్ల ఈ యువ పోలీసు అధికారి త్యాగం కారణంగా అక్కడ వందల మంది ప్రాణాలు నిలిచాయి. ఒకవేళ ఆ క్షణం పాచా తన ప్రాణాలను పణంగా పెట్టకపోతే ఆ ముష్కరుడు గేటు లోపలికి ప్రవేశించి భారీ ప్రాణ నష్టానికి ఒడిగట్టేవాడని ఆ దేశ మంత్రి నజీబ్ దనీష్ తెలిపారు. అయితే ఈ సంఘటనకు తామే కారకులమని ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది.