కాలిఫోర్నియా, అక్టోబర్ 10 : నిన్నటి వరకు నేట్ హరికేన్ తుఫానుతో వణికిపోయిన అగ్రరాజ్యం.. నేడు మరో ప్రకృతి విపత్తుతో అతలాకుతలం అవుతుంది. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియాలో కార్చిచ్చు చెలరేగింది. చిన్నగా అడవిలో మొదలైన మంటలు నెమ్మదిగా సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో ఒక్కసారిగా భారీ అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటలకు దాదాపుగా 1500 ఇళ్లు తగబడిపోగా.. పది మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు నాప, సొనొమా, యుబా కౌంటీస్లోని దాదాపు 14 ప్రాంతాలలో ఈ మంటల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనకు గ్యాస్ పైప్ లైన్ పేలడమే కారణమని... సుమారు 30,000 హెక్టార్లలో ఉన్న అడవి తగలబడుతోందని అమెరికా అగ్నిమాపక శాఖా అధికారులు వెల్లడించారు.