విజయవాడ, అక్టోబర్ 9 : ప్రపంచంలోనే బెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాని ఆ రాజధాని రైతులకు మాత్రం ఓ కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. రాజధాని నిర్మాణ పనుల నిమిత్తం భూ సమీకరణ చేసే సమయంలో తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఫ్లాట్లకు వాస్తు దోషం ఉందంటూ కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రైతులు తీవ్ర అసంతృప్తిని ప్రదర్శిస్తూ.. ఈ రోజుల్లో ఏ ఇల్లు కట్టుకోవాలన్నా, ఎలాంటి స్థలాలను కొనుగోలు చేయలన్నా.. మొదట చూసేది వాస్తు దోషమేనని వాపోతున్నారు. ప్రభుత్వం కూడా రాజధాని విషయంలో అదే వాస్తు దోషాన్ని పాటించి౦దన్నారు. రైతులు భూ సమీకరణ నిమిత్తం 33, 567 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించి తమకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లను ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ ఫ్లాట్లన్నంటికీ రహదారి, కేబుల్స్, విద్యుత్ వంటి ఇతర సౌకర్యాలను కల్పించి అప్పగిస్తామంటూ ప్రభుత్వం అంగీకరించింది. కాని అప్పుడు చూపించినవి కాకుండా.. ఇప్పుడు చూపించిన లే-అవుట్లలో దక్షిణ ముఖం ఉన్న ప్లాట్లను ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.