అమరావతి, సెప్టెంబర్ 11 : ఐటీ అభివృద్దికి సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్ 2018 నాటికి ముప్పై వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. తానూ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు ముప్పై ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని, సుమారు ఆరువేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. సోషల్ లైఫ్ కోసం విశాఖపట్టణంలో నెలకొక ఈవెంట్ లను నిర్వహించేలా కృషి చేస్తామని, నేటి తరం యువతను ఆకట్టుకునేలా విశాఖను తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నామన్నారు. అంతేకాకుండా ఈ అక్టోబర్ వరకు కాపులుప్పాడ ఐటీ లేఔట్ ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నలభై వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి నారా లోకేష్ వివరించారు.