ఉత్తర కొరియా, ఆగస్టు 29 : ప్రపంచ దేశాలను వరుస క్షిపణి ప్రయోగాలతో ఉక్కిరిబిక్కిరి చేయిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఇటీవల మూడో బిడ్డకు తండ్రయ్యాడు. ఈ మధ్య కాలంలో ఆయన భార్య రి సోల్ జు మూడో బిడ్డకు జన్మ నివ్వడం జరిగింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియాకు చెందిన యాన్ హప్ అనే న్యూస్ నేడు ప్రకటించింది. అయితే ఫిబ్రవరిలో రి సోల్ మూడో బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. 2009లో కిమ్, సోల్ ల వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా రి సోల్ అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు వెల్లువెత్తినవిషయం తెలిసిందే. ఉత్తర కొరియాను పాలించిన కిమ్ వంశీయుల్లో కిమ్ జాంగ్ మూడో తరానికి చెందిన వ్యక్తి. వీరి కుటుంబానికి సంబంధించిన విషయాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. కిమ్ తండ్రి, తాతలు ఏనాడూ తమ కుటుంబాన్ని బయటకు తీసుకురాలేదు. కిమ్ జాంగ్ మాత్రం ఆ సంప్రదాయానికి ముగింపు పలికి, తన భార్యను తనతో పాటే కొన్ని అధికారిక కార్యక్రమాలకు తీసుకొచ్చారు. కిమ్ జాంగ్ కు సంబంధించిన ప్రతి విషయం గోప్యంగానే ఉంటాయి. ఆయనకు పిల్లలు పుట్టిన విషయం కూడా విశ్వసనీయ వర్గాల ద్వారానే బయటకు తెలిసింది. ఈ మేరకు దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ ద్వారా ఈ విషయం కొందరు మంత్రులకు తెలిసిందని వెల్లడించారు.