ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈరోజు తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన ఫైల్స్పై సంతకాలు చేస్తారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం.. అటు పిమ్మట సచివాలయంలోని తొలి కేబినెట్ భేటీ కానుంది.
అదేవిధంగా ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్లో అడుగుపెట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే... 8.42 గంటలకు తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 8.50 గంటలకు కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై సీఎం సంతకాలు చేస్తారు. ఆ తర్వాత 9.15 గంటలకు సచివాలయం గ్రౌండ్కు చేరుకుని ఉదయం 11.30 గంటల వరకు అక్కడే ఉంటారు. కాగా, మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఉదయం 9.50 గంటలకు మొదలుకానుంది. ఇక ఆ తర్వాత ఉదయం 11.49 గంటలకు వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశం జరగనుంది.
ఇక తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8.15 గంటలకు సచివాలయం బయల్దేరనున్నారు సీఎం జగన్.. ఇప్పటికే సీఎం జగన్ కాన్వాయ్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు అధికారులు. తాడేపల్లి, లోటస్, కరకట్ట, చంద్రబాబు నివాసం, మంతెన ఆశ్రమం, సీడ్ యాక్సెస్ రోడ్డు, మందడం మీదుగా సచివాలయం వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఇక ఎక్కువ సమయం సామాన్య ప్రజల ట్రాఫిక్ నిలపకుండా చూడాలని ఇప్పటికే జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.