జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు విజయవాడ రానున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన భేటీ అవుతారు. అనంతరం, మధ్యాహ్న భోజనం తర్వాత కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో సమావేశం అవుతారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు ప్రజల నుంచి లభించిన మద్దతు, వచ్చిన ఓట్లు తదితర అంశాలపై పవన్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరపనున్నారు. అంతేకాకుండా, తాజా రాజకీయ పరిణామాలపైన కూడా పవన్ చర్చించనున్నారు.
నిజానికి గత ఏపీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ జోరుకు ప్రత్యర్థి పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంటే.. టీడీపీ 23కు పరిమితమయ్యింది. ఇక జనసేన ఒకే ఒక్క సీటును దక్కించుకుంది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్న జనసేనాని మళ్లీ ఓటమిపై సమీక్షలు చేసుకుంటూ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.