బ్యాలెట్ బాక్సులకు చెదలు

SMTV Desk 2019-06-04 16:24:18  trs,

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిమిత్తం బ్యాలెట్ బాక్స్ లను తెరచిన అధికారులు అవాక్కయ్యారు. గత నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగగా, పోలింగ్‌ కు, ఓట్ల లెక్కింపునకు మధ్య ఎక్కువ రోజుల వ్యత్యాసం ఉండటంతో బ్యాలెట్‌ బాక్సులన్నీ స్ట్రాంగ్‌ రూమ్‌ లలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కొన్ని బ్యాలెట్ బాక్స్ లను చెదలు పట్టాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, అంబట్‌ పల్లి ఎంపీటీసీ పరిధిలోని బ్యాలెట్‌ పత్రాలను చెదలు పాడుచేశాయి. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా, ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం, పలు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని చూపుతున్నారు. కొన్ని చోట్ల కరెంటు సరఫరా లేక కౌంటింగ్ నిలిచింది. అత్యధిక కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఎంపీటీసీ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే 154 ఎంపీటీసీలను ఏకగ్రీవంలో కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్, పలు చోట్ల ఆధిక్యత కనబరుస్తోంది. ఇప్పటి వరకూ 1653 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో టీఆర్‌ఎస్‌ 1073 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 334, బీజేపీ 79, ఇతరులు 167 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి. జడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం వరకు వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.