ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. పులివెందులలోని తన నివాసంలో మార్చి 15న వివేకానందరరెడ్డి హత్యకు గురయ్యారు. ముందుగా వివేకా గుండెపోటుతో మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, మార్చురీకి తరలించారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో వివేకాది హత్య అని తేలింది. దీంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వివేకా హత్యకు ప్రభుత్వ సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో అనేక మందిని విచారించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
వివేకాను ఆస్పత్రికి తరలించే సమయంలో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగంపై వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీయే కృష్ణారెడ్డి, వంట మనిషి లక్ష్మి కొడుకు ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఏప్రిల్ 22న ప్రొద్దుటూరు న్యాయస్థానంలో హాజరుపరచగా మే 6 వరకు రిమాండ్ విధించారు. ఆ గడువు ముగియడంతో తర్వాత మే 20 వరకు, మళ్లీ జూన్ 3వ తేదీ వరకు కోర్టు రిమాండ్ కొనసాగించింది. తాజాగా గడువు మరోసారి గడువు ముగియడంతో సోమవారం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీరికి జూన్ 17వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి మరోసారి ఆదేశాలిచ్చారు. దీంతో ఆ ముగ్గురిని పోలీసులు పులివెందుల సబ్జైలుకు తరలించారు.