సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిన్న తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పెరేడ్ గ్రౌండ్స్లో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అక్కడి నుంచి తన సొంత నియోజక వర్గమైన సత్తుపల్లికి బయలు దేరారు. పెరేడ్ గ్రౌండ్స్ లో దగ్గరలో ఉన్న శివాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన కారు డ్రైవర్, పక్కనే ఉన్న కాలువను గమనించలేదు. దీంతో వాహనం కాలువలోకి జారిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారు బోల్తా పడకుండా ఆగింది. వాహనం ఒరిగిపోతున్న సమయంలో సండ్ర, ఆయన గన్ మెన్ లు కిందకు దిగడం పెను ప్రమాదం తప్పింది. ఆ శివుడే తన ప్రాణాలను కాపాడాడని వ్యాఖ్యానించిన సండ్ర, ఆపై తన ప్రయాణాన్ని మార్చుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు.