ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని, అందువల్లే తాను వెళ్లలేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చినందునే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించిన ఆయన, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వైఎస్ జగన్ నెరవేరుస్తారని ఆశిస్తున్నానని అన్నారు. తనకు ఆహ్వానం వచ్చి ఉంటే తప్పకుండా వెళ్లేవాడినని అన్నారు. ఈ ఉదయం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు. జగన్ కు అభినందనలు తెలపాలని తమ పార్టీ ప్రతినిధులను పంపినా, వారిని కలిసేందుకు జగన్ అంగీకరించలేదని అన్నారు.