ఓవైపు సంతోషం, మరోపక్క బాధ!... తండ్రి సమాధి వద్ద మోకాళ్లపై కూర్చుని నివాళులు అర్పించిన జగన్

SMTV Desk 2019-05-30 12:19:47  jagan

ఏపీ కాబోయే సీఎం జగన్ ఇవాళ ఇడుపులపాయ విచ్చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం కడప సీఎస్ఐ చర్చి, అమీన్ పీర్ దర్గాలను సందర్శించిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు వచ్చారు.

ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి కాబోతున్న ఉత్సాహంలో ఉన్న జగన్ తండ్రి సమాధి వద్ద మాత్రం కాస్తంత బాధతో కనిపించారు. కించిత్ భావోద్వేగాలకు గురయ్యారు. తండ్రిని ఖననం చేసిన చోట మోకాళ్లపై కూర్చుని నివాళులు అర్పించారు.

అంతకుముందు అక్కడున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా, అక్కడికి వచ్చిన స్థానిక నేతలను పేరుపేరునా పలకరించారు. ఈ కార్యక్రమం అనంతరం జగన్ హెలికాప్టర్ లో విజయవాడ పయనం అయ్యారు.